Dmart: డీమార్ట్ బ్రాంచ్లో కరోనా
పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసే ఆరుగురు
సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. సదరు డీమార్ట్
బ్రాంచ్ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే మూసివేయించారు.
రానున్న ఐదు రోజుల పాటు స్టోర్ తెరవకూడదని ఆదేశాలు…
థానే: భారత్లో మరోసారి కరోనా తీవ్రరూపం దాల్చుతోంది.
కరోనా కేసుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన మహారాష్ట్రలో మరోసారి
కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. తాజాగా.. థానే జిల్లాలోని కళ్యాణ్
నగరంలోని ఓ డీమార్ట్లో కరోనా కేసులు కలకలం రేపాయి. కళ్యాణ్లోని బెయిల్
బజార్ డీమార్ట్ బ్రాంచ్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసే ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా
నిర్ధారణ అయింది. దీంతో.. సదరు డీమార్ట్ బ్రాంచ్ను కళ్యాణ్ డోంబివ్లీ
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే మూసివేయించారు. రానున్న ఐదు రోజుల
పాటు స్టోర్ తెరవకూడదని ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే
స్టోర్ను మూసేయించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. స్థానిక అధికారి
డాక్టర్ ప్రతిభా పంత్పాటల్ మాట్లాడుతూ.. డీమార్ట్ స్టోర్లో కరోనా
టెస్టింగ్ డ్రైవ్ బుధవారం నిర్వహించగా ఆరుగురు సిబ్బందికి పాజిటివ్గా
తేలిందని చెప్పారు.
వీరిలో లక్షణాలు తక్కువగా ఉన్న కొందరిని హోం క్వారంటైన్ పాటించాలని
సూచించామని, మరికొందరిని టాటా కోవిడ్ సెంటర్కు పంపామని తెలిపారు. మిగిలిన
సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్ పాటించాలని
సూచించామని చెప్పారు. లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే మున్సిపల్
కార్పొరేషన్ అధికారులకు సమాచారమివ్వాల్సిందిగా వారికి సూచించినట్లు ఆమె
తెలిపారు. సరిగ్గా నెల రోజుల క్రితం కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కి వందల
మందిని డీమార్ట్లోకి అనుమతించినందుకు ఇదే స్టోర్ మేనేజర్పై కేసు
నమోదైంది.
ఒకరోజు.. అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించగా స్టోర్లో దాదాపు 900 మందికి
పైగా ఉన్నారని, ఏమాత్రం భౌతిక దూరం పాటించలేదని.. కొందరికైతే మాస్క్లు
కూడా లేవని కల్యాణ్ పోలీసు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా… కరోనా
పాజిటివ్గా డీమార్ట్ను మూసేశారన్న విషయం తెలిసి కొద్దిరోజులుగా అందులోకి
వెళ్లిన జనం బెంబేలెత్తిపోతున్నారు. వెళ్లిన వారిని గుర్తించడం అధికారులకు
సవాల్గా మారింది. పాజిటివ్ వచ్చిన ఆరుగురు విధుల్లో భాగంగా ఏఏ వస్తువులను
తాకారో, ఆ వస్తువులను తామెక్కడ కొన్నామోనని ఆ డీమార్ట్లోకి వెళ్లిన జనం
హడలెత్తిపోతున్నారు.
