Strange Worms In Guntur: మాకే ఎందుకిలా జరుగుతోంది.?
ఎందుకిలా మా ప్రాణాలు తీస్తున్నాయి.? అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి.?
అంటూ లబోదిబోమంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు. వాళ్లకు ఈ బాధలు ఓ మాయదారి
పురుగు వల్ల వచ్చాయి. అదేంటి ఓ పురుగు ఇన్ని బాధలు పెడుతోందా.? అని
అనుకుంటున్నారా.? అసలు దాని సంగతేంటో ఇప్పుడు చూద్దాం..
ఒకవైపు దేశంలోని జనాభా అంతా కనిపించని కరోనా వైరస్తో పోరాడుతుంటే…
అక్కడి జనం మాత్రం కంటికి కనిపిస్తూ నిత్యం ప్రాణాలు తోడేస్తున్న పురుగులతో
చచ్చి బతుకుతున్నారు. రాత్రి లేదు పగలు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు…ఎటు
వెళ్లినా… వారిని ఆ పాడుబడ్డ పురుగులు వదలడం లేదు. అవి ఒంటి మీద వాలినా…లేక
చర్మం మీద పాకితే చాలు.. ఒళ్లంతా ఒకటే దురద. దద్దుర్లు. భరించరాని
మంటపుడుతుంది.
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి,
అన్నవరప్పాడు ,వీరాటం గ్రామస్తులు విచిత్రమైన పురుగుతో పడుతున్న బాధలు
అన్నీ ఇన్నీ కాదు. అది ఒక వింత పురుగు. చుట్టు పక్కల గ్రామాల్లో
రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది. పనుల మీద బయటకు వెళ్లే వాళ్లు…పొలం
పనులకు వెళ్లే రైతులు…ఇళ్లలో పని చేసుకుంటున్న మహిళలు ఇలా ఎవర్ని వదలడం
లేదు. బొచ్చు పురుగుల జాతికి చెందినవి కావడంతో ….అది శరీరానికి తాకడం వల్ల
ఒళ్లంతా దద్దుర్లు, దురద వస్తోందంటున్నారు గ్రామస్తులు. ఆ పురుగు వల్ల
కలిగే దురదలు, దద్దుర్లు కనీసం మూడు, నాలుగు రోజుల వరకు వదలడం
లేదంటున్నారు.
కాగా, సుబ్బయ్యపాలెంకు చెందిన ఓ మహిళ ఈ మాయదారి పురుగుతో ఐదు రోజుల పాటు
మంచాన పడింది. సుమారు నాలుగు గ్రామాల ప్రజలు ఈ పురుగు వల్ల ఇంత
బాధపడుతుంటే.. ఇప్పటికీ అధికారులు తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు
ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న సుబాబుల్
తోటల కారణంగానే అక్కడి పురుగులన్నీ కూడా గ్రామాల్లోకి వస్తున్నాయనే
అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వాటికి ఏ
మందులైన పిచికారి చేసి తమను ఈ బాధల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు.
