Corona Virus:
దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. ఆయా
రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ,
గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో రోజు రోజుకు
కరోనా బారిన పడే వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. దాంతో కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. జనాలను కూడా అప్రమత్తం చేశారు. అయితే,
మొదటి వేవ్ అనుభవంతో జనాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్లు
ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. ఇదే సమయంలో కోవిడ్
సోకినా.. తట్టుకునే శక్తి ఉండేందుకు బలవర్ధకమైన ఆహార పదార్థాలను
తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే పదార్థాలను తింటున్నారు.
ఇదిలాఉంటే.. తాజాగా కోవిడ్ 19 తట్టుకునే శక్తి గల పదార్థాన్ని
ఢిల్లీలోని ఆయుర్వేద ఆస్పత్రి గుర్తించింది. కోవిడ్ సోకినా తట్టుకునే
శక్తి చ్యవాన్ప్రాష్కు ఉందంటూ కొంతకాలంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ
నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుర్వేద ఆస్పత్రి
వర్గాలు చ్యవాన్ప్రాష్పై అధ్యయనం చేసి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
దేశంలో అతిపెద్ద ఆస్పత్రి అయిన చౌదరి బ్రహ్మ ప్రకాష్ ఆయుర్వేద చారక్
సంస్థాన్.. నాలుగు నెలల పాటు ఆరోగ్య సంరరక్షకులపై అధ్యయనం చేసిందట.
చ్యవాన్ప్రాష్ కమ్రం తప్పకుండా తీసుకున్న వారిలో కొవిడ్ను తట్టుకునే
శక్తి ఉత్పన్నమైందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం స్టడీ అండ్
కంట్రోల్ అనే రెండు గ్రూపులుగా సమానంగా విభజించి 200 మంది కోవిడ్ 19
నెగిటివ్ హెల్త్కేర్ నిపుణులపై మే నెల నుంచి అధ్యయనం ప్రారంభించారు.
వీరికి రోజుకు రెండు సార్లు 12 గ్రాముల చ్యవాన్ప్రాష్ ఉదయం అల్పాహారినికి
కనీసం గంట ముందు పరిగడుపున ఒకసారి.. రాత్రి పడుకునేందు ముందు గోరు వెచ్చని
నిటితో కలిపి అందించారు. అలాగే డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య
సంరక్షకులు నిబంధనలను పాటించారు. కాగా, నెల రోజుల పాటు వీరిపై అధ్యయన
కాలంలో ఏ ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. పైగా వారిలో ఇమ్యూనిటీ లెవెల్స్
పెరిగాయని ఆస్పత్రి డైరెక్ట్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ విదులా
గుజార్వార్ చెప్పారు. అయితే, కోవిడ్ 19 సోకే ప్రమాదం ఉన్న వారు, ప్రామాణిక
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు.. చ్యవాన్ప్రాష్ తీసుకోవడం వల్ల
రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు.
కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో చ్యవాన్ప్రాష్ వల్లే కలిగే ప్రయోజనాలపై
ప్రభుత్వ సంస్థ అధ్యయనం చేయడం ఇదే ప్రథమం. ఇదిలాఉంటే.. కోవిడ్కు
వ్యతిరేకంగా చ్యవాన్ప్రాష్ రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిరూపించడానికి
డాబర్, బైధ్యనాథ్, జండు వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆయుర్వేద, అల్లోపతి
ఆస్పత్రులతో కలిసి అధ్యయనాలు చేశాయి. జనవరి 2021 లో జండు చ్యవాన్ప్రాష్
బ్రాండ్ కంపెనీ ఇమామి లిమిటెడ్ తన బ్రాండ్ యొక్క సామర్థ్యాన్ని అంచనా
వేయడానికి ఆరోగ్యకరమైన వ్యక్తులపై అధ్యయనం చేయడానికి క్లినికల్ ట్రయల్స్
కోసం రిజిస్ట్రీ ఆఫ్ ఇండియాలో నమోదు చేసింది. భారతదేశంలోని 5 కేంద్రాల్లో
దీనిపై అధ్యయనం జరుగుతోంది. ఇదే విధమైన అధ్యయనాన్ని గత ఏడాది మేలో డాబర్
ఇండియా లిమిటెడ్ తన ఉత్పత్తి డాబర్ చ్యవాన్ప్రాష్ను ‘కరోనా మహమ్మారి
నివారణిగా’ స్పాన్సర్ చేసింది. తాము చేసిన అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చాయని
కంపెనీ ప్రకటించింది.
ఇదిలాఉంటే.. మూలికా, ఆయుర్వేద ఉత్పత్తుల కంపెనీలు కోవిడ్ -19 ను
ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయని, మహమ్మారి సమయంలో
విజృంభిస్తున్న సమయంలో తమ ఉత్పత్తుల అమ్మకం కోసం అవి పోటీ పడుతున్నాయంటూ
ఫార్మా డీలర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
