ఏపీ రివైజ్డ్
పెన్షన్ రూల్స్-1980 చట్టబద్ధమైనవి.. అధికరణ 309ను అనుసరించి
రూపొందించారని వ్యాఖ్యానించింది. జీవో ద్వారా దీనికి అర్హత విషయంలో షరతులు
విధించడం తగదని.. ఆస్తి హక్కు నుంచి పింఛన్ పొందే హక్కును నిరాకరించడానికి
వీల్లేదని పేర్కొంది
- పింఛన్కు సంబంధించి కీలక తీర్పు
- జీవో 152 రద్దు చేసిన ఏపీ హైకోర్టు
- 2019లో జీవోను తీసుకొచ్చిన సర్కార్
ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు
సంచలన తీర్పు ఇచ్చింది. ఉద్యోగి పని చేసి పదవీ విరమణ తర్వాత కన్నుమూస్తే..
వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పింఛను పొందేందుకు
అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది.
2019 నవంబరులో ప్రభుత్వం జారీ చేసిన జీవో 152ను రద్దు చేసింది. పిటిషనర్లకు
గతంలో చెల్లించిన మాదిరిగానే కుటుంబ పింఛను ఇవ్వాలని అలాగే నిలిపివేసిన
దగ్గర్నుంచి 6 శాతం వడ్డీతో వారికి పెన్షన్ చెల్లించాలంది.
పింఛన్ పొందే అర్హతలను రాజ్యాంగ నిబంధనల ద్వారా కల్పించినప్పుడు..
కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి జీవో జారీ చేయడం ద్వారా.. అర్హతల్లో
మార్పులు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఏపీ రివైజ్డ్ పెన్షన్
రూల్స్-1980 చట్టబద్ధమైనవి.. అధికరణ 309ను అనుసరించి రూపొందించారని
వ్యాఖ్యానించింది. 1980నాటి నిబంధనలు వితంతు, విడాకులు పొందిన కుమార్తె
పింఛన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని గుర్తు చేశారు. జీవో
ద్వారా దీనికి అర్హత విషయంలో షరతులు విధించడం తగదని.. ఆస్తి హక్కు నుంచి
పింఛన్ పొందే హక్కును నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది.
కుటుంబ పింఛన్ అనేది వ్యక్తిగత ఆస్తి హక్కులో భాగమని కోర్టు తెలిపింది.
చట్టం అనుమతించకుండా నిలిపివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును
ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. పింఛన్ నిలిపివేసే ముందు పిటిషనర్లకు
నోటీసు ఇవ్వలేదని గుర్తు చేశారు. పింఛన్ వయసును 45 ఏళ్లుగా నిర్ణయించడం
హాస్యాస్పదమని.. ఆ కారణంగా పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. వయసు పెరిగే
కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అలాంటప్పుడే ఆర్థిక అవసరాలు ఎక్కువగా
ఉంటాయన్నారు. 45 ఏళ్ల లోపు, 45 ఏళ్లు దాటిన వితంతువులు, విడాకులు తీసుకున్న
మహిళల విషయంలో వివక్ష చూపడం తగదన్నారు.
పదవీ విరమణ తరువాత మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె వితంతువు అయినా,
విడాకులు తీసుకున్నా వారి కుటుంబ పెన్షన్ విషయంలో నిబంధనలను మారుస్తూ
ప్రభుత్వం 2019 జీవోను తీసుకొచ్చింది. 45 ఏళ్ల వయసు దాటిన, వితంతు,
విడాకులు తీసుకున్న కుమార్తెల పిల్లలు మేజర్లు అయితే కుటుంబ పింఛన్
పొందేందుకు అనర్హులుగా జీవోలో పేర్కొన్నారు. ఈ జీవో ఆధారంగా పలువురికి
పెన్షన్లు నిలిచిపోయాయి. దీంతో జీవోను సవాలు చేస్తూ కొందరు కోర్టును
ఆశ్రయించగా కోర్టు తీర్పు ఇచ్చింది.
