ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ పై స్పందించారు సీఎం వైఎస్
జగన్.. కోవిడ్ 19 నియంత్రణ, నివారణ, కోవిడ్ వాక్సినేషన్పై జిల్లాల
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక సూచనలు చేశారు..
కోవిడ్ కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది.
గత ఏడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పని చేస్తున్నాయి.. కోవిడ్
నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది
వరకు చాలా బాగా పని చేస్తున్నారు.. వారి సేవలు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ
అదే స్ఫూర్తితో తిరిగి పని చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.. వాక్సినేషన్
అనేది శాశ్వత పరిష్కారం అన్నారు సీఎం జగన్.. అయితే అది మన చేతుల్లో
లేదు. ఎందుకంటే ఆ డోస్లు కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. నెలకు 7 కోట్ల
వ్యాక్సీన్లు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు 23 లక్షల డోస్లు
తయారవుతున్నాయి.. వాక్సిన్ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ
కేంద్రానిదే.. దీంతో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు వీలైనంత
వరకు అందరికి వాక్సిన్ ఇవ్వడంతో పాటు, మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరి
కట్టాల్సి ఉందన్నారు.
ఏపీలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 1.55 కోట్ల పరీక్షలు చేయగా 9.37 లక్షల
కేసులు పాజిటివ్గా తేలాయని. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.03 శాతం
కాగా, రికవరీ రేటు 96.19 శాతంగా ఉందన్నారు సీఎం జగన్.. రాష్ట్రంలో
టయర్–1 వంటి నగరాలు లేకపోయినా మనం మనకున్న వసతులతో బాగా పని చేయగలిగామన్న
ఆయన.. కోవిడ్ కేసులను గుర్తించి పరీక్షలు చేయడంతో పాటు, అవసరమైన
చికిత్స చేశాం. ఈ ప్రక్రియలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, గ్రామ, వార్డు
వలంటీర్లు, ఏఎన్ఎంలతో పాటు, సచివాలయాలు కీలకపాత్ర పోషించాయి. దేశంలో కరోనా
సెకండ్ వేవ్ మొదలైంది. రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి.
పాజిటివిటీ రేటు చిత్తూరులో ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత శ్రీకాకుళం, విశాఖ,
కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. ఇది
కష్టకాలం కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి.. లాక్డౌన్ విధించకుండా
కోవిడ్ను నియంత్రించాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలు దెబ్బ తినకుండా
ఉండేందుకు లాక్డౌన్ విధించడం లేదన్నారు.. గత ఏడాది చూశాం.. లాక్డౌన్
వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు..
మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు అన్నారు. ఇప్పుడు మనకు ఉన్న అస్త్రం వాక్సిన్..
అందువల్ల లాక్డౌన్ అన్న మాట రాకుండా కోవిడ్ నియంత్రణపై అధికార
యంత్రాంగం దృష్టి పెట్టాలి.. కాబట్టి, ఫోకస్డ్ టెస్టింగ్. అంటే కోవిడ్
పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్లను టెస్టు చేయడం. దాన్నే
ఫోకస్డ్ టెస్టింగ్ అంటారు. అదే విధంగా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి
టెస్టు చేయించుకోవాలంటే, వారికి కూడా వెంటనే చేయాలి. ఆ విధంగా తగిన
ఏర్పాట్లు చేయాలి. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో టెస్టులు చేసే విధంగా
ఏర్పాట్లు చేయాలి. అక్కడ శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు సీఎం వైఎస్
జగన్.
ఇంట్లో ఐసొలేషన్ కోసం ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్ కేర్
సెంటర్కు పంపించాలి. అక్కడ కూడా శానిటేషన్, మెడికేషన్, ఫుడ్ క్వాలిటీ,
మందులు అందుబాటులో ఉంచడం, ఎప్పటికప్పుడు చెక్ చేయడం కూడా మన బాధ్యత.
రాష్ట్రంలో ఇప్పుడు 26 కోవిడ్ కేర్ సెంటర్లలో 13,500 బెడ్లు ఉండగా, మనం
వాటి సంఖ్యను గత సెప్టెంబరు నాటితో చూస్తే, అంటే 50 వేల బెడ్లకు పెంచాల్సిన
అవసరం ఉందన్నారు సీఎం జగన్.. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి సంబంధించి..
వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సర్వే ద్వారా కోవిడ్ కేసుల నిర్ధారణ
చేసిన తర్వాత లేదా 104 కాల్ సెంటర్ తర్వాత కోవిడ్ కేసు గుర్తిస్తే,
వెంటనే ఆ ఇంటిని మార్క్ చేసి, ఆ ఇంట్లోని రోగికి వెంటనే కోవిడ్ కిట్
ఇవ్వడంతో పాటు, రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మూడు రోజులకు ఒకసారి
ఏఎన్ఎంలు ఆ ఇంటిని సందర్శించాలి. వారు పరిస్థితి చూసి, డాక్టర్ ఆ ఇంటికి
వెళ్లేలా రిక్వెస్టు చేయాలి. రోగి పరిస్థితి బాగా లేకపోతే, కోవిడ్ కేర్
సెంటర్కు తరలించడం లేదా ఆస్పత్రిలో చేర్పించడంపై నిర్ణయం తీసుకుని అమలు
చేయాలి.. అన్ని ఆస్పత్రులలో సీసీ టీవీలు ఉండాలి. అది తప్పనిసరి. అలాగే
హెల్ప్ డెస్కులు కూడా ఉండి తీరాలన్నారు.
