RBI Instructions : నలిగిపోయిన.. పాతబడిన.. చిరిగిపోయిన కరెన్సీ
నోట్లను మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక ఈ నోట్లు మన వద్ద ఉంటే ఎలా
మార్చుకోవాలా?
నలిగిపోయిన.. పాతబడిన.. చిరిగిపోయిన కరెన్సీ నోట్లను మనం తరచూ చూస్తూనే
ఉంటాం. ఇక ఈ నోట్లు మన వద్ద ఉంటే ఎలా మార్చుకోవాలా? అని తెగ
మదనపడిపోతుంటాం. దుకాణాల్లో, పెట్రోల్ బంకుల్లో ఇచ్చినా.. ప్రయాణాల్లో
వాడినా ఫలితం లేక రోజుల తరబడి జేబుల్లోనే పెట్టుకోవాల్సిన దుస్థితి. అయితే ఈ
ఖరాబైన నోట్లను మీ సమీపంలోని ఏ బ్యాంక్కైనా వెళ్లి సులువుగానే
మార్చుకోవచ్చని, బదులుగా కొత్త నోట్లను తెచ్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్
ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెప్తున్నది.
పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఆ నోట్లను
తెచ్చినవారు తమ ఖాతాదారులా? కాదా? అన్నది చూడవద్దని, వారి వద్ద నోట్ల
మార్పిడికి ఎలాంటి చార్జీలు కూడా వసూలు చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఇటీవల రూ.5 లక్షల విలువైన నోట్లు చెదలు
పట్టిన ఘటన వెలుగుచూసిన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలు ప్రాధాన్యతను
సంతరించుకున్నాయి. తీవ్రంగా దెబ్బతిని చెల్లుబాటు కాని స్థితిలో ఉన్న
కరెన్సీని కూడా ప్రత్యేక ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చని సెంట్రల్
బ్యాంక్ వెల్లడించింది.
అయితే సదరు నోట్లపై నెంబర్ మాత్రం తప్పక కనిపించాల్సి ఉంటుంది.
నిజానికి పాడైపోయిన నోట్లను కమీషన్ తీసుకుని బదులుగా ఇతర నోట్లను ఇచ్చే
వ్యాపారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ దందా ఆర్బీఐ కార్యాలయాల సమీపంలో
ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఈ పాడైన నోట్లను బ్యాంకుల్లో,
ఆర్బీఐ ఆఫీసుల్లోనే మార్చేస్తారని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి.
