బాబోయ్ ఎండలు
మండిపోతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను
ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ
ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు
మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది.
ఒక వైపు కరోనా భయం వెంటాడుతుంటే.. ఇప్పుడు భానుడి భగభగలు సెగలు
పట్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సమ్మర సుర్రుమంటోంది. మరో మూడు
రోజుల పాటు ఎండలు చాలా తీవ్రం కానున్నాయని భారత వాతావరణ శాఖ
హెచ్చరిస్తోంది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న బలమైన వేడి గాలులతో చాలా
జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే
కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటడం ఆందోళన పెంచుతోంది. ఏప్రిల్ తొలిరోజే
తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45
డిగ్రీలు నమోదు కాగా భీమవరంలో 44 డిగ్రీలు, ఏలూరు, జంగారెడ్డిగూడెంలో 43
డిగ్రీలు, తణుకు లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర ఉక్కపోతతో
ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఏడు గంటల నుం చే చాలా
ప్రాంతాల్లో భానుడి ప్రతాపం చూపుతున్నాడు. మరో మూడు రోజుల పాటు ఇదే
పరిస్థితి ఉంటే అవకాశం ఉంది.
గురువారం రాజమహేంద్రవరంలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
నమోదు కాగా.. కడపలో 44 డిగ్రీలు, గుడివాడలో 43, నెల్లూరులో 42 డిగ్రాల
ఉష్ణోగ్రతలతో భానుడు భయపెడుతున్నాడు. ఏప్రిల్ తొలి రోజే పరిస్థితి ఉంటే
రాబోయే రోజుల్లో అసలు ఈ ఎండని తట్టుకోవడం సాధ్యమేనా అని ప్రజలు ఆందోళనకు
గురవుతున్నారు. ఇటు గత రెండు రోజుల్లో 3-4 సెల్సియస్ డిగ్రీల అధిక
ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో తిరుపతి వాసులు ఆందోళనకు గురయ్యారు. నగరంలో
వృక్షాలను పూర్తిగా తొలగించడంతో పచ్చదనం కొరవడడం, కాంక్రీటు భవనాల నుంచి
వస్తున్న వేడి సెగలతో పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలు, భక్తులు ఉక్కపోతకు
గురవుతున్నారు.
రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ 5వ తేదీ వరకు పగటిపూట
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అత్యవసరమైతే తప్ప రాకపోకలు సాగించవద్దని
భారత వాతావరణ మండలి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు 5
కి మీ వేగానికి గాలి పరిమితం కావడం, గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోయి..
కొన్ని చోట్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు సైతం 30 సెల్సియస్ డిగ్రీల వరకు
నమోదవుతున్నాయి. గత నాలుగైదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా
పెరుగుతున్నాయి. 2020 మే 28న గరిష్ఠంగా 43 సెల్సియస్ డిగ్రీలు నమోదుకాగా..
ఈ ఏడాది ఏప్రిల్ లోనే 45 డిగ్రీల మార్కు చేరుతోంది చాలాచోట్ల.
ప్రస్తుతం
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. మరో మూడు రోజుల పాటు
ఎండలు అధికం కానున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే
పరిస్థితి కొనసాగితే ముందుముందు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారే
ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా ఈ ఎండలు పెరగడానికి గల కారణం.. హీట్వేవే
అంటున్నారు నిపుణులు. రాజస్థాన్ ఎండారి చాలా దూరంలో ఉన్నప్పటికీ అక్కడి
నుంచి వేడి గాలులు ఇక్కడి వరకు వ్యాపిస్తున్నాయి. పైగా వాటిలో వేడి ఏ
మాత్రం తగ్గదు. క్రమ క్రమంగా వేడి గాలులు ఇక్కడికి వ్యాపించడంతో
రాత్రింబవళ్లు కూడా వేడి తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజుల్లో
వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్
కె.కన్నబాబు హెచ్చరించారు. ఇప్పటికే 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వీయనున్నాయని, 217 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఆయన స్పష్టం
చేశారు.
గుంటూరులో 29, కృష్ణాలో 27, విజయనగరం 19, విశాఖపట్నం 10
మండలాల్లో వగాల్పులు వీయగా.. గురువారం 148 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 207
మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గుంటూరులో 33, కృష్ణాలో 24, పశ్చిమ గోదావరి లో 18, విజయనగరం 18, తూర్పు
గోదావరి లో 16, విశాఖపట్నం 15, శ్రీకాకుళం 10 మండలాలకు హెచ్చరికలు జారీ
చేశారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ జిల్లా యాంత్రాంగాన్ని అప్రమత్తం
చేసింది. ఎండలు మరింత తీవ్రతరం కానున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని
జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దాహం అనిపించకపోయినా..
ఎక్కువగా నీళ్లు తాగుతుండాలని అన్నారు. అలాగే వడగాలుల బారిన పడకుండా
మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం అయితే
తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
