Covid Warning issued by union health ministry:
తగ్గుతుందనుకుంటున్న తరుణంలో సెకెండ్ వేవ్తో విరుచుకుపడిన కరోనా వైరస్
కారణంగా దేశం మరోసారి అత్యవసర పరిస్థితిలోకి వెళుతుందని హెచ్చరికలు జారీ
చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. 2021 జనవరి 31న దేశంలో మొదలై కరోనా
తాకిడి.. జులై నుంచి సెప్టెంబర్ దాకా ఉగ్ర రూపం చూపించింది. ఆ తర్వాత కేసుల
సంఖ్య తగ్గుతుండడంతో ఇక కరోనాతో భయం లేదని అందరూ భావించారు. ఈ భావనే
పరోక్షంగా ప్రజల్లో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని పెంచింది. ఫలితంగా మళ్ళీ
2021 ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది.
మార్చి మిడిల్ నాటికి కేసులు రెట్టింపయ్యాయి. మార్చి చివరి వారంలో దేశంలో
ప్రతీ రోజు 60 వేల పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే
కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు మంగళవారం (మార్చి 30న) సీరియస్
వార్నింగ్ జారీ చేసింది.
దేశంలో ఇటీవల తక్కువ కాలంలోనే కరోనా పాజిటివ్ కేసులు ఐదు రెట్లు
పెరిగాయని, పరిస్థితి తీవ్రంగా మారుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం
హెచ్చరించింది. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని
విజ్ఞప్తి చేసింది. మాస్కుల వినియోగం తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు
సూచించింది. మాస్క్లు ముక్కు, నోటిపైనే ఉండాలే పర్యవేక్షించాలని
తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి పరిస్థితి చేజారకుండా
చూసుకోవాలని ఆదేశించింది. దేశంలో వైరస్ ఉద్ధృతిపై ఆరోగ్యశాఖ అధికారులు
తాజా సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు.
‘‘గత సంవత్సరం (2020) జులై నుంచి దేశంలో
కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబరులో వైరస్ విస్తృతి మరింత
తీవ్రమైంది. ఆ తర్వాత నుంచి కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు
కన్పించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచి కేసులు మళ్లీ పెరిగాయి.
ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దానివల్ల దేశం
మొత్తం ప్రమాదంలో పడుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు
కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’
అని నీతి ఆయోగ్ ఆరోగ్యం
విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. అయితే ప్రజలు కూడా కోవిడ్
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న
రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలి, కాంటాక్ట్ ట్రేసింగ్
చేపట్టి వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచాలని సూచించింది. నిజానికి ఈ
సూచనలు గత ఏడాది కాలంగా కేంద్రం ఇస్తూనే వుంది. కరోనా కేసులు తగ్గుముఖం
పట్టడంతో నిబంధనల అమలులో అలసత్వం చేరింది. తాజాగా పరిస్థితి విషమిస్తున్న
సంకేతాలు కనిపిస్తుండడంతో కేంద్ర మరోసారి కఠిన నిబంధనలపై రాష్ట్రాలకు
సూచనలు జారీ చేసింది.
మహారాష్ట్రలో పరిస్థితి విషమం
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా వున్న ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం
గుర్తించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య మళ్ళీ 5
లక్షలు దాటింది. ఈ సంఖ్య జనవరిలో లక్షన్నర మాత్రమే వుండింది. ఫిబ్రవరి
నుంచి మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రభావం యావత్ దేశం మీద
కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,40,720 యాక్టివ్ కేసులుండగా..
క్రియాశీల రేటు 4.47 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా పది జిల్లాలో
అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో ఎనిమిది జిల్లాలు ఒక్క
మహారాష్ట్రలోనే వుండడం ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. 59 వేల
పైచిలుకు క్రియాశీల కేసులతో పుణె అగ్రస్థానంలో ఉండగా.. ముంబయి,
నాగ్పూర్, ఠాణె, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్,
న్యూఢిల్లీ, అహ్మద్నగర్లో అత్యధిక యాక్టివ్ కేసులున్నట్లు గణాంకాలు
చెబుతున్నాయి.
మహారాష్ట్రతోపాటు.. పంజాబ్ ప్రభుత్వాలపై కేంద్ర ఆరోగ్య శాఖ అసంతృప్తి
వ్యక్తం చేసింది. పంజాబ్లో కేసులు పెరగడానికి అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య
ధోరణే కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అక్కడ ప్రజలకు కోవిడ్ పరీక్షలు
చేయడం లేదని, వైరస్ సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచడంలోనూ ప్రభుత్వం
విఫలమైందని ఆరోపించింది. ‘‘ఫిబ్రవరిలో పంజాబ్లో సగటు రోజువారీ కేసులు
240గా ఉండేవి. ఇప్పుడు రోజుకు 2,700 కేసులు వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం
సరిగ్గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయకపోవడం వల్లే కేసులు పెరిగాయి’’అని
ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు.
ఓవైపు కరోనా పరీక్షల సంఖ్య పెంచడం, పాజిటివ్గా తేలిన వారిని
ఐసోలేషన్కు తరలించి చికిత్స అందించడంతోపాటు కరోనా నియంత్రణకు
వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం
నిర్ణయించింది. ఇందులో భాగంగా 45 ఏళ్ళు నిండిన వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ
నుంచి వ్యాక్సిన్ వేయనున్నారు. 45 ఏళ్ళు నిండి దీర్ఘకాలిక వ్యాధులున్న
వారికే వ్యాక్సిన్ వేసే వారు. దీర్ఘకాలిక వ్యాధులు అనే నిబంధనకు ఏప్రిల్ 1
నుంచి సడలింపు ఇవ్వనున్నారు. ఇకపై 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు
వేసుకునేందుకు అర్హులేనని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం
కోవిన్ యాప్లో ముందస్తు నమోదు చేయించుకోవాలని సూచించారు. లేదంటే ప్రతి
రోజూ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే
రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా వ్యాక్సిన్ పొందొచ్చని తెలిపారు. వ్యాక్సిన్
కేంద్రానికి వెళ్లేప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్కార్డు లేదా
ఓటర్ ఐడీతో పాటు బ్యాంక్ పాస్బుక్, పాస్ట్పోర్టు లేదా రేషన్
కార్డులలో ఏదైనా) తీసుకెళ్లాలని చెప్పారు.
